గత 2019 ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రాజ కీయ రంగ ప్రవేశం చేయనున్నారు. దీనికి సంబంధించి అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని బలంగా దెబ్బ కొట్టాలని భావిస్తున్న టీడీపీ.. ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్కు కంచుకోటగా ఉన్న పులివెందుల, రాజంపేట, కడప నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో మరింతగా దూకుడు ప్రదర్శిస్తూ.. వివేకా సతీమణిని రంగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. టీడీపీ లో చేర్చుకునేందుకు చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి 2014లోనే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ తరఫున పులివెందుల టికెట్ ఆశించారు. అయితే.. అప్పటి సమీకరణల నేపథ్యానికి తోడు వివేకా అడ్డగింతతో ఆప్రయత్నం నిలిచిపోయింది. ఫలితంగా నర్రెడ్డి సైలెంట్ అయ్యారు.
అయితే, ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని.. వివేకా కుటుంబం కూడా బలంగా నిర్ణయించుకున్న దరిమిలా.. ఈ దిశగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఢిల్లీలో వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తమకు న్యాయం చేయాలని భావిస్తున్న ప్రజలు తమ వెంటే ఉండాలనికూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సౌభాగ్యమ్మ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైందని అంటున్నారు.
ఆమెకు పులివెందుల నుంచి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలనేది చంద్రబాబు యోచన. తద్వారా.. సీఎం జగన్ను ఓడించాలని ఆయన భావిస్తున్నారు. ఇక్కడ వివేకా హత్య జరగడం, వైసీపీ సహా సీఎం జగన్ సానుభూతి పవనాలు కూడా తగ్గుముఖం పట్టడం. మహిళా సెంటిమెంటు..ఇలా అనేక అంశాలు కలిసి వస్తాయని చంద్రబాబు వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. సౌభాగ్యమ్మ ఎంట్రీ ఖాయమనేది క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం.