Chandrababu : విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు Chandrababu అమరావతి పై సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి ఆంధ్రుల హక్కు అంటూ గట్టిగానే నినాదాలు చేస్తున్నారు, మరి ఎవరైనా ఉద్యమానికి ముందడుగు వేశారా అంటూ ప్రశ్నించారు. అమరావతి ప్రాంత ప్రజలలో రోషం పట్టుదల అసలు ఉన్నాయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి ఒకరు బయటకు వచ్చి ఎందుకు పోరాడటం లేదు అంటూ ప్రశ్నించారు. వైసిపి పాలనంతా అవినీతి మయం అంటూ విమర్శించారు. డబ్బుల కోసం ఓట్లు వేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్న వారమవుతాం అన్నట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రజల్లో చైతన్యం రావాలని విజయవాడ నగర మేయర్ స్థానాన్ని టిడిపికి కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల ప్రచారంలో విజయవాడ వాసులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని లేకపోతే ప్రత్యర్థులు మనల్ని కొడతారు అన్నట్టు కార్యకర్తలకు మరియు కృష్ణా జిల్లా ప్రజలకు బాబు సూచించారు. అమరావతి నాకోసం నిర్మించడానికి నేను రాలేదు అని, తెలుగు ప్రజల కోసం.. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానిలో ఒక రాజధానిగా ఉండే విధంగా.. అమరావతిపై కలలు కన్నాను అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టు నా కోసం నేను కట్టుకున్ననా..? ప్రజల కోసం కాదా..? నీళ్లు తాగుతున్న వారు ఏం చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు విజయవాడ వాసులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.