విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు ఒక కొలిక్కి రాక ముందే చిత్తూరు జిల్లాకు చెందిన వైద్యురాలు అధికార పార్టీ నేతలపై పోరాటం ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు జరుగుతుండగా మరో వైపు మహిళా వైద్యురాలు అనితా రాణి కూడా సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే ఆమె వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలకు గానూ ప్రభుత్వం సీఐడి విచారణకు ఆదేశించింది.
డాక్టర్ అనితా రాణి ఏకంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఆసుపత్రిలో అక్రమాలను ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు గతంలో నాలుగు సార్లు బెదిరించారని ఆమె పేర్కొంటుంది. డిఎం అండ్ హెచ్ఒ డాక్టర్ పెంచలయ్య వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించిన అనితా రాణి…సీఐడి పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నది.
మరో పక్క ఆమె పోరాటానికి బీజేపీ, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలుపుతున్నారు. బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్ది, పలు ప్రజా సంఘాల నాయకులు అనితా రాణి నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
కాగా డాక్టర్ అనితా రాణి కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీఐడి ఎస్ పి రత్న తన బృందంతో నిన్న చిత్తూరు చేరుకొని విచారణ ప్రారంభించారు. అనితా రాణి డిమాండ్ పై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరిస్తుందా? సీఐడి దర్యాప్తునే కొనసాగిస్తుందా వేచి చూడాలి.