YSRCP: జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు గెలవాలన్నదే మన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్దమా అని క్యాడర్ ను ప్రశ్నించారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు.
విశ్వసనీయమైన పాలన అంటే ఏమిటో చూపించామని అన్నారు జగన్. గడచిన 58 నెలల్లో మంచి జరిగి ఉంటేనే ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉండాలని కోరారు. ఎన్నికల్లో తనపై ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని అందుకే అధికారం కోసం తోడేళ్ల మందలా జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జతకట్టడమే వారి పని అని అయితే, మీ గుండెల్లో గుడికట్టడమే జగన్ చేసిన పని అని అన్నారు.
మీ బిడ్డ ప్రతి గుండెలో ఉన్నాడు. మీ గుండెల్లో మన ప్రభుత్వం ఉంది. ఇవాళ మీ బిడ్డ ఒక్కడిపై ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ… ఇంత మంది ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్ర పూరితంగా ఏకమవుతున్నారు అని అన్నారు. విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ నేతలు కానీ, మన వాలంటీర్లు కానీ, ఇంటింటా అభివృద్ధి అందుకున్న పేదలు కానీ… వీరిలో ఏ ఒక్కరైనా భయపడతారా? అని ప్రశ్నించారు.
ప్రతి ఒక్కరికీ మేలు చేయగలిగాం కాబట్టి, గతంలో ఎన్నడూ ఇలా రాజకీయాల్లో జరగలేదు కాబట్టి, గతంలో రాష్ట్రంలో ఇలాంటి పాలన ఎన్నడూ చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి… ఇవాళ మనకు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంది అని అన్నారు. బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా అందించింది రూ.2.70 లక్షల కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే.. నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు అందించే గోరుముద్ద, విద్యార్థులకు అందించే ట్యాబ్ లు, విద్యా దీవెన… ఇలాంటివన్నీ కలుపుకుంటే ఈ 58 నెలల కాలంలో అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చామని వివరించారు.
ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, ఒక్క రూపాయి లంచం లేదు, ఒక్క రూపాయి దోపిడీ లేదు, ఒక్క రూపాయి కమీషన్ లేదు… ఇదీ మన ట్రాక్ రికార్డు అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం, ఒక్క స్కీమ్ గుర్తుకు రాదని అన్నారు.
Pensions Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ