అమరావతి: వెంటనే చెన్నైకి మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రుల బృందం ఒకటి శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ని కలిశారు.
తీవ్రమైన తాగునీటి సమస్యతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగడానికి నీళ్లులేక 90లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని తమిళనాడు మంత్రుల బృందం ముఖ్యమంత్రికి వివరించింది.
తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్.జగన్ వెంటనే చెన్నైకి మంచినీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందనీ, ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలనీ జగన్ పేర్కొన్నారు. అడిగిన వెంటనే చెన్నైకి తాగునీరు ఇస్తున్నందుకు తమిళనాడు మంత్రుల బృందం జగన్కు కృతజ్ఞతలు తెలిపింది. సీఎంను కలిసిన వారిలో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖ మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ మణివాసన్ ఉన్నారు.