న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా బిజెపివైపు చూస్తున్న పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ చివరికి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇవాళ ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్తో వివేక్ భేటీ అయ్యారు. తనతోపాటు మరి కొంతమంది నేతలు బిజెపిలోకి వస్తారని వివేక్ తెలిపినట్లు సమాచారం.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్న బిజెపి దళిత, గిరిజన సామాజిక వర్గాల్లో బలమైన నేతలపై దృష్టి పెట్టింది.
పార్టీలో చేరిన తర్వాత వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణిలో నడుస్తున్నారని ఆరోపించారు. ఆయన నియంతృత్వ పోకడకు బిజెపి బుద్ధి చెబుతుందన్నారు. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చలేదని అన్నారు. నియంతృత్వ పాలన అంతమై ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పడాలని ఆకాంక్షించారు.
తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడంపైనే సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారని వివేక్ వ్యాఖ్యానించారు. గతంలో తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. పార్టీలో బలమైన ఉద్యమ నేతలు ఉండకూడదన్నదే సీఎం ఉద్దేశమని చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాలను చూసి ఇంకా చాలా మంది బిజెపిలో చేరుతారని ఆయన అన్నారు.