అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారనీ, పోలీసులు పట్టించుకోవడం లేదనీ టిడిపి నాయకులు ఆరోపించారు. పల్నాడులో వైసిపి దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటూ చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ పేర శుక్రవారం అక్కడ పర్యటించిన టిడిపి నేతల బృందం ఈ విషయంపై సత్తెనపల్లి, గురజాల డిఎస్పీలను కలిసి ఫిర్యాదు చేసింది.
వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపాలనీ, లేని పక్షంలో గ్రామాలలో బస చేసి అక్కడే తిష్ట వేస్తామని టిడిపి నేతలు పేర్కొన్నారు. పత్తిపాటి పుల్లారావు, కోడెల శివప్రసాద రావు, జీ.వి.ఆంజనేయులు, నక్కా అనందబాబు, శ్రావణ్ కుమార్, శాసనసభ్యులు మద్దాలి గిరి, అనగాని సత్యప్రసాద్ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయనీ, కొన్ని గ్రామాలలో టిడిపి కార్యకర్తలు ఊళ్లు వదలి వెళ్లారనీ టిడిపి నేతలు పేర్కొన్నారు. అవసరం అయితే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామనీ, అధికారం శాశ్వతం కాదన్న మాట వైసిపి నేతలు గుర్తుంచుకోవాలనీ వారు పేర్కొన్నారు.