YS Jagan: ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి బనగాలపల్లిలో రూ.22 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ పై మరో సారి విమర్శలు గుప్పించారు సీఎం జగన్.
పేదల భవిష్యత్తుపై యుద్దానికి చంద్రబాబు కూటమి మరో సారి సిద్దమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద జాగ్రత్తగా ప్రయోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో పేద వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ పథకాలు అన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు. గతంలో చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబు పేరు చెబితే వంచనలు, మోసాలే గుర్తుకు వస్తాయన్నారు. దత్తుపుత్రుడు పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడన్నారు. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవని అన్నారు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈ రోజు మీ బిడ్డ మీదకు యుద్దానికి రావడం కాదనీ, పేద వాడి భవిష్యత్తు మీద యుద్దానికి వస్తున్నారని విమర్శించారు. 99 శాతం హామీలను అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మీ బిడ్డ ఆశీస్సులు అడుగుతున్నాడని అన్నారు.
మీ ఇంట్లో మీకు మేలు జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలని సూచించారు. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇబీసీ నేస్తం డబ్బులు ఒక వారం ఆటో ఇటో వస్తాయని, ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదన్నారు. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ డబ్బులు చేరతాయన్నారు. ఈ రెండు వారాల పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవద్దనీ, ఏబీఎన్, టీవీ 5 చూడవద్దని జగన్ సూచించారు.
CM YS Jagan: అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఉద్దేశం – సీఎం వైఎస్ జగన్