Corona Cases: దేశంలో కరోనా మహామ్మారి మరో సారి విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశంలో మొన్న 16,764 కేసులు నమోదు కాగా, నిన్న 22,775 కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం నిన్న 8,949 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే కరోనాతో 406 మంది మృతి చెందారు. ఆక్టివ్ కేసుల సంఖ్య లక్ష పైగా చేరుకుంది. ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,04,781కి చేరుకుంది. అయితే రికవరీ శాతం ఎక్కువ ఉండటం కొంత ఊరట కల్గిస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది.
Corona Cases: 1,431కి పెరిగిన ఒమైక్రాన్ కేసులు
మరో పక్క కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 1,431కి పెరిగింది. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, కేరళ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ లో 115, కేరళలో 109 కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
తెలుగు రాష్ట్రాల్లో
ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమై చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరిస్తున్నప్పటికీ ఎక్కడా భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. ఒమిక్రాన్ కేసులు 50వేల వరకూ చేరుకోవచ్చని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏపిలో ప్రస్తుతానికి ఒమైక్రాన్ 17 కేసులు మాత్రమే ఉన్నట్లు గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే తెలంగాణలో కేసులు పెరుగుతుండటం ఆంధ్రాలో ఆందోళన కల్గిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంత వాసులు వేలాది మంది సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు విచ్చేస్తుంటారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వాలు ఎటువంటి ఆంక్షలు పెడతారో అని భయపడుతున్నారు.