అమరావతి : కియా కార్ల పరిశ్రమ తరలింపు కధనాలపై సిఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. గురువారం సిఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు. నిన్న కియాను సందర్శించేందుకు వెళుతున్న తనను, తమ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టులు చేశారన్నారు. ఇది సరైన చర్య కాదన్నారు. ఇప్పటికే 13,500 కోట్ల రూపాయలు ఈ పరిశ్రమపై పెట్టుబడి పెట్టారనీ, 30 వేల కార్లు ఉత్పత్తి అయ్యాయినీ, వేలాది మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మరో రెండు వేల కోట్ల పెట్టుబడితో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం భూమి సమకూర్చుకున్నారని అన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం గుట్టూరులో 580 ఎకరాలు భూమి తీసుకున్నారనీ, ఉత్పత్తి కోసం ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకున్నారని పేర్కొన్నారు. కాని ఈ సమయంలో కియా ఫ్యాక్టరీ తరలిపోతుందనే కధనాలు స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. తక్షణం దీనిపై సిఎం జగన్ స్పందించి కియా ఫ్యాక్టరీ తరలింపు కధనాలపై స్పష్టత నివ్వాలని రామకృష్ణ కోరారు.
అదే విధంగా కర్నూల్ జిల్లాలో సహకార బ్యాంకులలో రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలపై అపరాధ వడ్డీలు మాఫీ చేయాలని కోరారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై వడ్డీలకు తోడు అపరాధ రుసుములు చెల్లించలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆయా గ్రామాలలో దండోరాలు వేయిస్తున్నారనీ, అలా చేయడం వల్ల రైతులు మానసికంగా క్రుంగిపోతున్నారనీ పేర్కొన్నారు. తక్షణం అపరాధ వడ్డీలను మాఫీ చేయించి ఇప్పటికే చెల్లించిన అపరాధ వడ్డీ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయించాలని లేఖలో ముఖ్యమంత్రి జగన్ ను రామకృష్ణ కోరారు.