Cycle Girl: సైకిల్ గర్ల్ Cycle Girl పని మీద పక్క వీధికి వెళ్లాలన్నా నేడు బైక్ లేకుండా దాదాపుగా ఎవరూ వెళ్లని పరిస్థితి. అలాంటిది సైకిల్ మీద ఏకంగా 1200 కిలోమీటర్ల ప్రయాణమంటే మాటలు కాదు. ఎవరు చేస్తారు.. బాబోయ్.. అంటారు. కానీ.. 15 ఏళ్ల జ్యోతి కుమారి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అది కూడా తన తండ్రి మోహన్ పాశ్వాన్ ను అదే సైకిల్ పై కూర్చోబెట్టుకుని మరీ. అవును.. గతేడాది లాక్ డౌన్ సమయంలో తండ్రిని స్వగ్రామానికి తీసుకొచ్చే క్రమంలో జ్యోతి కుమారి చేసిన సాహసం దేశవ్యాప్తంగా మోగిపోయింది. అయితే.. ఆమె ఆనందం ఏడాది తిరిగేసరికి విషాదాంతమైంది. ఈరోజు జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ గుండెపోటుతో మరణించారు. వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని దర్భంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్ పాశ్వాన్ కుటుంబ పోషణ నిమిత్తం హరియాణా రాష్ట్రంలోని గుర్ గ్రామ్ లో ఆటో నడిపేవాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. గతేడాది లాక్ డౌన్ కు ముందు ఆయన ప్రమాదానికి గురై నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఉపాధి కోల్పోవడంతో ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాడు. ఇల్లు ఖాలీ చేయాలని ఇంటి యాజమాని ఒత్తిడి ఓవైపు.. లాక్ డౌన్ తో రవాణా వ్యవస్థ లేకపోవడం మరోవైపు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో మోహన్ పెద్ద కుమార్తె జ్యోతి కుమారి తన దగ్గరున్న డబ్బులతో ఓ పాత సైకిల్ కొని దానిపై తండ్రిని కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామానికి మే 10న బయలుదేరింది.
Read More:Brahmastra: ‘బ్రహ్మాస్త్ర..’ బ్రహ్మాండంగా..! 10 టీజర్లు.. 13 మోషన్ పోస్టర్స్ రెడీ..!!
వారం రోజుల్లో.. మే 16కి ఆమె స్వగ్రామానికి చేరుకుంది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా హోరెత్తిపోయింది. విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపిన తెగువకు దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. భారత సైక్లింగ్ ఫెడరేషన్ ఆమెకు సైక్లింగ్ లో శిక్షణనిచ్చేందుకు ముందుకొచ్చింది. ఇవాంకా ట్రంప్ కూడా మెచ్చుకున్నారు. ఈఏడాది ప్రధానమంత్రి బాలల పురస్కారాన్ని కూడా అందుకుంది. ఆత్మనిర్భర్ పేరుతో నిర్మిస్తున్న ఓ సినిమాలో జ్యోతి కథను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఆమె పాత్రను తానే స్వయంగా పోషిస్తోంది. ఇంత కష్టపడిన జ్యోతికి ఆ ఆనందం ఏడాదిపాటు మాత్రమే మిగిలింది. సోమవారం ఉదయం ఆమె తండ్రి మోహన్ గుండెపోటుతో మృతి చెందడం ఆమె కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.