B.S.Yediyurappa: కర్నాటకలో కనిపించని చెయ్యోదో రాజకీయం నడుపుతోంది.ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పదవీచ్యుతి ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్డౌన్ అధికారికంగా ముగిశాక వచ్చే నెల ఏడో తేదీన ఈ విషయంలో ఒక క్లారిటీ రాగలదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో బిజెపి శాసనసభ్యులు యడ్యూరప్పకు వ్యతిరేకంగా కూటమి కట్టినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. వీరు ఇటీవలి కాలంలో ఢిల్లీకి కూడా వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులను కలుసుకొని కర్నాటకలో సీఎంను మార్చాల్సిన ఆవశ్యకతను వివరించారని వినవస్తోంది.కేంద్రం కూడా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు జూన్ ఏడో తేదీ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని వారికి చెప్పినట్లు వినికిడి.
సీనియర్ మోస్ట్ సీఎం!
యడ్యూరప్ప కర్ణాటక లోనే సీనియర్ మోస్ట్ సీఎం.ఇప్పటికి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.మూడుసార్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.ఎనిమిది సార్లుగా ఓటమి లేకుండా అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు.అయితే ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం బిజెపి శాసన సభ్యులకు నచ్చకపోవడం వల్లనే వారు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని రాజకీయవర్గాలు చెప్తున్నాయి.
Read More: hair loss: బట్టతల రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!(పార్ట్ -1)
భూ పందారం పై భగభగలు
ఇటీవల యడ్యూరప్ప ప్రభుత్వం బళ్లారిలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమిని కేటాయించింది.అది మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలకు రుచించలేదు.జనతాదళ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి దీన్ని వ్యతిరేకించింది.అదే బీజేపీ ఇప్పుడు పవర్ లోకి రాగానే ఈ భూ పందారం చేయడాన్ని కొందరు శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ విషయంలో నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తూ సీఎంకు నేరుగానే లేఖ రాశారు .ఇది బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని, పార్టీకి చెడ్డపేరు రాగలదని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.అయినా యడ్యూరప్ప స్పందించలేదు.అంతేగాకుండా ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తి మరికొందరిలో ఉంది.కరోనా సంక్షోభంలో ఎమ్మెల్యేలు తమకు ముఖ్యులైన వారికి పడకల కోసం చేసిన సిఫార్సులు కూడా చెల్లలేదని,అధికారులు ఇలా వ్యవహరించడానికి కారణం ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన ఆదేశాలే అని మరికొందరు వాపోతున్నారు.ఒక ఎమ్మెల్యేగా తమకు గౌరవం విలువ అధికారం ఏమీ లేవని వారు చెప్పారు. ఈ కోవకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలు నలభై మంది వరకు ఉన్నారని, త్వరలోనే వారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కూడా ప్రారంభించనున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది.ఏం జరుగుతుందో వేచి చూడాలి.