కరోనా వైరస్ విజృంభణ తర్వాత చాలా మంది తమ ఆరోగ్యం పై అధికంగా శ్రద్ధ చూపుతున్నారు. మరీ ముఖ్యంగా వివిధ రకాల వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, చిరు ధాన్యాలైన కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, పైన చెప్పిన చిరుధాన్యాలలో తక్కువ ధరకు లభిస్తూ.. అధిక ప్రయోజనాలు కలిగించేవి జొన్నలు. అలాంటి జొన్నల ద్వారా కలిగే లాభాలు మీ కోసం..! జొన్నల్లో శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం అధికంగా లభిస్తుంది. అలాగే, జొన్నల్లో ఉండే ప్రోటీన్లు, ఐరన్, పీచు పదర్థాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆహరంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
నరాల బలహీనతలను తగ్గించే గుణంతో పాటు శరీరంలో ఉండే చెడు పదర్థాలను దూరం చేయడంలో జొన్నలు ప్రభావవంతగా ఉంటాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ కారణంగా ఎముకలు బలంగా తయారవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మతిమరుపును కూడా తగ్గిస్తాయి. కంటి చూపు సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అలాగే, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడంతో పాటు సంబంధిత సమస్యలు జొన్నలు తినడం ద్వారా దరిచేరకుండా ఉంటాయి. ఎందుకంటే జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే హర్మోన్ల ఉత్పత్తిలో జొన్నలు మంచి ఫలితాన్ని చూపుతాయి. జొన్నల్లో విటమిన్ బీ6 కూడా ఉంటుంది. పాలిచ్చే తల్లులు, బిడ్డలకు ఇవి చాలా మంచివి. జొన్నలతో చాలా రకాలైన వంటకాలు కూడా తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం చాలా సులభం. కాబట్టి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగించే జొన్న వంటకాలు మీరు కూడా తినండి మరి..!