Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యుల్ విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది సేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించింది. మిజోరాంలో 40, తెలంగాణలో 119, మధ్యప్రదేశ్ లో 230, రాజస్థాన్ 200, చత్తీస్ గడ్ లో 90 స్థానాలకు ఎన్నికల తేదీలను ఆయన ప్రకటించారు.
తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగుతుందని ప్రకటించారు. ఒకే విడతలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుందని వెల్లడించారు. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని తెలిపారు. పరిశీలన 13 నవంబర్, 2023 అని వివరించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 అని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ 3 డిసెంబర్ 2023 (ఆదివారం) జరగుతుందని చెప్పారు.
ఇక రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్ లో నవంబర్ న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. చత్తీస్ గఢ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండో దశలో నవంబర్ 17న జరగనున్నాయి. ఇక అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
అయిదు రాష్ట్రాల్లో అయిదు రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలు, 17.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. కొత్తగా యువతరం అధికంగా ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వృద్ధులు ఇంటి నుండి ఓటు వేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో మహిళ ఓటర్ల సంఖ్య పెరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. నేటి నుండి అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఆయన తెలిపారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచుతున్నామని తెలిపారు.
తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది, రాజస్థాన్ లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో 1,77 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయిదు రాష్ట్రాల్లో 940 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సరిహద్దుల్లో తనిఖీలను ప్రత్యేక బృందాలు నిర్వహిస్తాయని తెలిపారు.