EC: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గోయెల్ రాష్ట్రపతికి పంపగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అరుణ్ గోయల్ పదవీ కాలం 2027 డిసెంబర్ వరకు ఉంది. అయితే .. ఆయన రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. 1985 పంజాబ్ కేటర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ ..2022 నవంబర్ లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులైయ్యారు. ఫిబ్రవరిలో అనుప్ పాండే పదవీ విరమణ చేయగా, అరుణ్ గోయెల్ రాజీనామా చేయగా, ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్ లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.
మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని వార్తలు వినబడుతున్న తరుణంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గోయెల్ రాజీనామా వల్ల ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడవచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి.