Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవంగా దహనం అయ్యారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికులు మృతి చెందారు. విద్యుత్ వైర్లు తెగిపడటం వల్ల విద్యుతాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఒడిశాకు చెందిన రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఘటనకు సంబంధించి అధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు.