DMDK: తనకు టిక్కెట్ రాలేదన్న ఆవేదనతో ఓ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. డీఎండీకే నేత గణేశ మూర్తి (77) 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో డీఎంకే, ఎండిఎంకే కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఎండిఎంకే కు తిరుచ్చి లోక్ సభ స్థానం కేటాయించగా, అక్కడి నుండి దురైవైగో ను పార్టీ తమ అభ్యర్ధిగా ప్రకటించింది.
దీంతో గణేశమూర్తి ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన గణేశ మూర్తి ఈ నెల 24న ఉన్నట్లుండి అస్వస్థతకు గురైయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన .. ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
1993లో ఎండీఎంకే ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్న గణేశ మూర్తి 1998లో తొలి సారిగా పళని లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో ఈరోడ్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి దాదాపు 2 లక్షల భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
మూడు పర్యాయాలు లోక్ సభ సభ్యుడుగా, ఒక పర్యాయం ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వహించారు గణేశ మూర్తి. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నంకు పాల్పడి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు.
YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్