మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ త్వరలోనే వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్గా మారింది.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమైన సన్నిహితుల్లో నారాయణ కూడా ఒకరు.ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు నెల్లూరు జిల్లా చెందిన నారాయణలు పార్టీకి ఆర్థికంగా కొండంత అండగా నిలిచారు.
అందుకే వారిద్దరినీ చంద్రబాబు మంత్రులను కూడా చేశారు.తాజా పరిణామాల నేపథ్యంలో శిద్దా రాఘవరావు వైసిపికి వెళ్లిపోగా నారాయణ కూడా అదే పనిలో ఉన్నారంటున్నారు. ఇందుకు రకరకాల రాజకీయ కథనాలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలను నెలకొల్పడం తో పాటు దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు నారాయణ. పార్టీ దశాబ్దకాలంపాటు ప్రతిపక్షంగా ఉన్న సమయంలో నారాయణ వంటి వారు పార్టీకి ఆర్థిక పరిపుష్టి కలిగించారు. బహుశా ఈ కారణం చేతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించడం తోపాటు పార్టీలో బాగా ప్రాధాన్యత ఇచ్చారు.
అయినప్పటికీ 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వీచిన వ్యతిరేక పవనాల లో నారాయణ సైతం కొట్టుకుపోయారు. దీంతోపాటు తాజాగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను వారి వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ల అరెస్ట్ వంటి సంఘటనలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా విద్యాసంస్థలు కలిగి ఉన్న నారాయణ వ్యాపారాలను కూడా ఇదే విధంగా టార్గెట్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలాగే అమరావతి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన నారాయణ ఇప్పుడు ఆ విషయమై జరుగుతున్న దర్యాప్తులో కూడా ఇరుక్కుంటానేమోనన్న భయంతో ఉన్నారంటున్నారు. ఒత్తిడుల తో పాటు, రాజకీయ భవిష్యత్తు కోసం వైయస్ఆర్సిపి గూటికి నారాయణ త్వరలోనే చేరే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అడుగులు ఎటువైపు వేస్తారన్నది వేచి చూడాలి.