అమరావతి: వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఏ) తొలి చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో విఎంఆర్డిఏ చట్టం అమలులోకి వచ్చిన తరువాత చైర్మన్ నియామకం జరగడం ఇదే ప్రధమం. ఇప్పటి వరకూ విఎంఆర్డిఏ తాత్కాలిక చైర్మన్గా మున్సిపల్ శాఖ కార్యదర్శి వ్యవహరిస్తూ వచ్చారు.
దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీనియర్ నేతలను నామినేటెడ్ పోస్టులలో నియమిస్తున్నారు. తొలుత టిటిడి చైర్మన్గా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిని నియమించిన ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఏపిఐఐసి చైర్మన్గా నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజాను నియమించిన సంగతి తెలిసిందే.