YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవేళ సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు గుమ్మనూరు జయరాం తెలిపారు.
ఈ సందర్భంలో గుమ్మనూరు జయరాం కీలక కామెంట్స్ చేశారు. సీఎం జగన్ విగ్రహంలా మారిపోయారని అన్నారు. ఆయన ఏమీ మాట్లాడరని, విగ్రహానికి పూజారులుగా ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని, వారి వారసులకు (వర్గీయులకే) న్యాయం చేస్తారు కానీ భక్తులకు న్యాయం చేయరని అన్నారు. తనకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో ఇద్దరం మంత్రులుగా ఉంటే మరో మంత్రి ప్రాతినిధ్యం వహించే డోన్ లో అభివృద్ధి జరిగింది గానీ తన నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రిగా ఉండి తాను చేసేది ఏమి చేయలేక పోయానని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం అవమానంగా భావిస్తున్నానన్నారు. వైసీపీకి కరుడుగట్టిన తీవ్ర వాదిగా పని చేశానని, తాను ఎక్కడ ఉన్న కరుడు గట్టిన తీవ్రవాదిగానే పని చేస్తానన్నారు. జిల్లాలో అభివృద్ధి జరగని వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఆలూరేనని చెప్పారు. తన నియోజకవర్గానికి, తనకు పార్టీలో అన్యాయం జరిగినందు వల్లనే బయటకు వస్తున్నట్లుగా చెప్పారు.
ఇప్పటి వరకూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వైసీపీ వీడగా, అయిదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కీలక నేత పార్టీ వీడి బయటకు రావడం ఇదే ప్రధమం. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా జడ్పీటీసీ విరూపాక్ష ను పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జయరాం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అయితే జయరాంకు కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జిగా పార్టీ నియమించినా ఆయన లోక్ సభకు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. జయరాం గుంతకల్లు టికెట్ ఆశిస్తుండగా, టీడీపీ నుండి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరేందుకు ఇవేళ జయరాం విజయవాడ చేరుకున్నారు. ఆలూరు నుండి భారీ కాన్వాయ్ తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.
గుమ్మనూరు జయరాం టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2001 లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. 2005 లో చిప్పగిరి మండల జడ్పీటీసీ గా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అలూరు నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
జయరాం దాదాపు 37వేలకుపైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2011లో వైసీపీలో చేరిన గుమ్మనూరు జయరాం 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన జయరాం..గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కోట్ల సుజాతమ్మపై దాదాపు 39వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన మాజీ ఉన్నతోద్యోగులు .. వెయ్యి కోట్లకు దావా