గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో భద్రత విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో జరగబోయే ఎన్నికల విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో మొత్తం 13500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఎక్కడెక్కడ క్రిటికల్ పరిస్థితులు ఉన్నాయో వాటిని ముందే గుర్తించి ఉన్నతాధికారులను అక్కడ పెట్టేసి ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఆ ప్రాంతంలో ఉండేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పోలింగ్ సమయంలో జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, సీపీ సజ్జనార్ తెలిపారు.
ఎన్నికల ప్రచారం సమయంలో ప్రజలు అదే విధంగా రాజకీయ నేతలు కూడా పోలీసులు సూచించిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా సైబరాబాద్ పరిధిలో గతంలో అనేక మార్లు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి జరగబోయే గ్రేటర్ ఎన్నికలు కూడా అదే రీతిలో జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. దాదాపు 150 డివిజన్లకు జరుగుతున్న ఈ గ్రేటర్ పోరులో తెలంగాణ ప్రధాన పార్టీలన్నీ పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా పోటీ చూస్తే ఎంఐఎం, టిఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో గెలవడంతో గ్రేటర్ మేయర్ స్థానాన్ని కూడా గెలవటానికి బిజెపి తహతహలాడుతోంది. మరో పక్క టిఆర్ఎస్ గ్రేటర్లో సత్తా చాటి పార్టీ పరువు నిలబెట్టుకోవాలని, ప్రతిపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయింది. మరి నగర ప్రజలు జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.