ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి చూపు కరోనా కలకలంపైనే. ఆ మహమ్మారిని అరికట్టేందుకు రాబోయే టీకా గురించే. కొవిడ్ టీకా కోసం ఆరునెలలకు పైగా ఎదురుచూస్తున్న భారతీయులకు నిజంగా ఇది శుభవార్తే.
ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన, సురక్షితమైన భావిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకాను మరో 73 రోజుల్లోనే ఇండియాలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ టీకాను తామే సేకరిస్తామని భారత సర్కారు ఇప్పటికే ప్రకటించి ఉండడంతో ఇది అందరికీ ఉచితంగానే లభించనుందని తెలుస్తోంది.
ఇదే ఆ టీకా….
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల్లో మేడిన్ ఇండియా టీకాపై ఆశలు నెలకొన్నాయి. ఆస్ట్రాజెన్కా ఔషధ సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ టీకాను అభివృద్ధి చేస్తున్నారు. ఈ టీకాను ఇండియాలో కొవిషీల్డ్ పేరుతో పిలుస్తున్నారు. దీనిని ఇండియాలో పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
అప్పుడే మొదలయ్యాయి.
భారతదేశంలో కొవిషీల్డ్ మూడో దశ ట్రయల్స్ ఆగస్టు 22 న పుణే, ముంబై, అహ్మదాబాద్ సహా 20 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఈ వ్యాక్సిన్ను 1600 మందిపై ప్రయోగిస్తారు. టీకా సమర్థత, భద్రతను పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షిస్తున్నారు. కాగా, ఇప్పటి నుంచి 73 రోజుల్లో ఈ టీకా వాణిజ్యపరంగా వచ్చే అవకాశం ఉందని ఎస్ఐఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారట
తమ బయోటెక్నాలజీ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్పాదక ప్రాధాన్యత లైసెన్స్ మంజూరు చేసిందని, 58 రోజుల్లో ట్రయల్స్ పూర్తి కావడానికి ట్రయల్ ప్రొటోకాల్ ప్రక్రియలను వేగంగా ట్రాక్ చేసిందని ఆయన వివరించారు. మూడో(చివరి) దశ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా శనివారం (ఆగస్టు 22) మొదటి మోతాదు ఇచ్చామని, రెండో మోతాదును 29 రోజుల తరువాత ప్రయోగిస్తామని చెప్పారు. రెండో మోతాదు ఇచ్చిన 15 రోజుల తర్వాత ఫలితం తెలుస్తుందన్నారు. దీన్ని బట్టి కొవిషీల్డ్ను మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారి వివరించారు. కాగా, టీకా ఉత్పత్తితోపాటు మార్కెటింగ్ కోసం ఎస్ఐఐ సంస్థ ఆస్ట్రాజెన్కాతో ఒప్పందం చేసుకుంది. ఇండియాతోపాటు 92 ఇతర దేశాల్లో వ్యాక్సిన్ను అమ్ముకునేందుకు ఆస్ట్రాజెన్కాకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రాయల్టీ ఫీజు చెల్లించనుంది.
మనోళ్లందరికీ ఉచితం
స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా ప్రధాని మోడీ కీలక విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం భారత్లో మూడు టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, వ్యాక్సిన్ ఉత్పత్పి, సేకరణ బ్లూప్రింట్ రెడీ అయిందని వివరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రచారం జరుగుతోంది. భారత్లో స్వదేశీ కంపెనీ ఉత్పత్తి, మార్కెటింగ్ చేస్తున్న కొవిషీల్డ్ టీకాను నేరుగా తామే సేకరిస్తామని ఇండియన్ గవర్నమెంట్ ఎస్ఐఐకి చెప్పింది. అంటే ఎస్ఐఐ నుంచి టీకాను కొనుగోలు చేయనుంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎస్ఐఐ నుంచి 130 కోట్ల మంది భారతీయ పౌరులకు 68 కోట్ల మోతాదులను ప్రభుత్వం కోరినట్లు సమాచారం. దీంతో ఏ టీకా ముందు వస్తే ఆ వ్యాక్సిన్ను భారత సర్కారు తీసుకొని, ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలుస్తోంది.
అబ్బే అలాంటిదేం లేదు….
అయితే, కరోనా నియంత్రణ వ్యాక్సిన్ కోవిషీల్డ్ లభ్యతపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం, ఊహాజనితమని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది. ప్రస్తుతం టీకా తయారీ, భవిష్యత్తు వినియోగం కోసం నిల్వ చేయడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆదివారం తెలిపింది. మరో 73 రోజుల్లో కోవిషీల్డ్ మార్కెట్లోకి వస్తుందని, భారతీయులకు ఈ వ్యాక్సిన్ ఉచితమంటూ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది.