ఉబర్ క్యాబ్ సేవల ద్వారా దాదాపు 800 మందికిపైగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించినందుకు 49 ఏళ్ళ భారత సంతతికి చెందిన వ్యక్తికి అక్కడి కోర్టు మూడేళల్ జైలు శిక్ష విధించింది. కాలిఫోర్నియాలో నివసించే రాజిందర్ పాల్ సింగ్ అలియాస్ జస్ఫాల్ గిల్, మరి కొందరితో కలిసి 800 మందికిపైగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించాడు. దీని కోసం ఉబర్ సంస్థ క్యాబ్ సేవలను వినియోగించాడు. 2018 జూలై 2022 మే వరకూ రాజిందర్ పాల్ సింగ్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. కెనడా నుండి ఉత్తర సరిహద్దు మీదుగా సీటెల్ తో పాటు వాషింగ్టన్ స్టేట్ లోని పలు ప్రాంతాలకు ఉబర్ క్యాబ్ ల ద్వారా భారతీయులను అక్రమంగా తరలించాడు.
ఈ నేరాలకు సంబంధించి 17 ఉబర్ ఖాతాలను అమెరికా పోలీసులు గుర్తించారు. భారతీయుల అక్రమ తరలింపునకు గానూ ఈ ఖాతాలలో 80వేల కుపైగా అమెరికా డాలర్లను చార్జీలుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. మరో పక్క రాజిందర్ పాల్ సింగ్ నివాసంలో 45వేల అమెరికా డాలర్ల నగదుతో పాటు పలు ఫోర్జరీ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్టన్ కు భద్రాతాపరమైన ముప్పు కలిగించినట్లు కోర్టు ఆరోపించింది.
అలానే ఆమెరికాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేసిన భారతీయులను కూడా అతడు ముప్పులోకి పడేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ అభియోగాలకు కూడా పాల్పడినట్లు ఆరోపించింది. తన నేరాన్ని ఒప్పుకున్న రాజిందర్ పాల్ సింగ్ కు కోర్టు 45 నెలల జైలు శిక్ష విధించింది. రాజిందర్ పాల్ సింగ్ కాలిఫోర్నియాలో చట్టబద్దంగా నివసించడం లేదని పోలీసుల దర్యాప్తు లో తేలినందున జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని అమెరికా నుండి బహిష్కరించే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.