IPL 2021 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొట్టమొదటిసారి ప్రారంభం అయినపుడు ఆ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ పెద్ద స్టార్ ప్లేయర్స్ లేకుండానే యువరక్తం తో మొదటి టైటిల్ గెలుచుకుని టోర్నీ ని ఘనంగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత వారు ప్లేఆఫ్ చేరడానికే ఆపసోపాలు పడ్డారు.
శిల్పాశెట్టి కో-ఓనర్ గా వ్యవహరిస్తున్న ఈ జట్టు ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో మంచి ప్లేయర్లను సొంతం చేసుకొని ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయితే గత కొన్ని సీజన్లుగా ఈ జట్టుకి విశేష సేవలందిస్తున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈసారి ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ మొదటి అర్ధ భాగంలో అతను పాల్గొనబోడు అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.
గాయం కారణంగా ఆర్చర్ 23 నుండి భారత్ తో జరగబోయే వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఇదే క్రమంలో దాదాపు రాజస్థాన్ రాయల్స్ ఆడే సగం మ్యాచ్ లకు దూరంగా ఉంటాడు. మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడో లేదో పూర్తిగా తెలియని పరిస్థితి. ఇది రాజస్థాన్ రాయల్స్ ను మరింత కలవరపెట్టే విషయం.
ఎందుకంటే అతని స్థానంలో మరొక మధ్యలో తీసుకోవాలంటే కోవిడ్ నిబంధనల ప్రకారం ఇంకొక వారం ఆలస్యం అవుతుంది. అదీ కాకుండా ఆర్చర్ వారి ప్రధాన పేసర్. బట్లర్, స్టోక్స్ వంటి భారీ పేర్లు ఉన్న ఈ జట్టుకి ఈ సీజన్లో సంజు సాంసన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కాబోయే ఈ మెగా టోర్నీకి ముందు రాయల్స్ కు ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం నిజంగా దురదృష్టకరం.