కృష్ణాజిల్లా వైసీపీ రాజకీయం పూర్తి గందరగోళంగా మారింది. జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉన్న వాళ్లకే సీటు వస్తుందా ? రాదా లేదా స్థానచలనం తప్పదా అన్నది ఎవరికీ అంతుపడటం లేదు. కృష్ణా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని – గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ – విజయవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి వైసీపీలో అయోమయంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీళ్లంతా ఒక వెలుగు వెలిగారు. నాని వైసిపి లోకి వెళ్ళాక మంత్రి అవడంతో పాటు ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యారు. అలాంటి నానికే ఇప్పుడు గుడివాడలో సీటు వస్తుందా ? లేదా ఆయనను గన్నవరం పంపుతారా అన్నది చాలా డౌట్ గా ఉంది.
విచిత్రం ఏంటంటే ఎల్లో మీడియాలోనూ కాకుండా ఇటు సీఎం జగన్ సొంత మీడియాలో కూడా కొడాలి నానిని గన్నవరం పంపుతారని.. అక్కడ నుంచి నాని పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక గన్నవరం ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీని మైలవరం లేదా బెజవాడ పార్లమెంటు నుంచి పోటీచేయిస్తారని తెలుస్తోంది. గన్నవరం తెరమీదకు అనూహ్యంగా ఇటీవల టిడిపి నుంచి వైసీపీలోకి జంప్ అయిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పేరు తెరమీదకు వచ్చింది. ముద్రబోయిన గన్నవరం వైసీపీ నుంచి పోటీలో ఉంటే వంశీ బెజవాడ పార్లమెంటుకే అంటున్నారు.
మరి ఇదే జరిగితే టిడిపి నుంచి వైసిపి కండువా కప్పుకున్న బెజవాడ ఎంపీ కేశినేని నాని పరిస్థితి ఏంటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. నానిని జగన్ ఇప్పటికే బెజవాడ పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాని కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇలాంటి టైంలో కొడాలి నానిని గుడివాడ నుంచి గన్నవరంకు మార్చి.. వంశీని బెజవాడ పార్లమెంటుకు పోటీచేయిస్తే కేశినేని నానికి సీటు లేకుండా పోతుంది. అలాగే మరో ప్రచారం కూడా జరుగుతోంది.
ప్రస్తుతం పెనమలూరు ఇన్చార్జిగా ఉన్న మంత్రి జోగి రమేష్ ను మైలవరం కు మార్చి.. కేశినేని నానిని పెనమలూరుకు మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జోగి రమేష్ ను పెనమలూరులో కంటిన్యూ చేస్తే నానిని మైలవరం అసెంబ్లీ బరిలో నిలిపినా ఆశ్చర్య పోవక్కర్లేదని జిల్లా వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కేశినేని – వల్లభనేని – కొడాలి అంటూ కృష్ణ జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన ఈ ముగ్గురు లీడర్ల పరిస్థితి ఇప్పుడు జగన్ దగ్గర అయోమయం గందరగోళంగా మారిందన్నది వాస్తవం.