వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వైసీపీ మద్దతుతో విశాఖ గర్జన శనివారం విజయవంతం అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రులు, వైసీపీ నేతలు వికేంద్రీకరణ ఆవశ్యకతను వివరిస్తూ టీడీపీ, జనసేన చర్యలను విమర్శించారు. వర్షంలో సైతం వేలాదిగా జనాలు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న వైసీపీ కీలక నేతల కాన్వాయ్ పై జనసేన శ్రేణులు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద దాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో పక్క విశాఖ గర్జన నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
విశాఖను మీరు రాజధాని చేయడం ఏంట్రా బాబు, విశాఖ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకు రెండో రాజధాని చేయమని గర్జించండి అని నాగబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా వైసీపీ ఇంజ్యూరియస్ టూ ఏపి ఎన్విరాన్ మెంట్, సేవ్ వైజాగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ డెస్ట్రాయర్స్ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ఆయన తన ట్వీట్ కు జత చేశారు నాగబాబు.
మరో పక్క పవన్ కళ్యాణ్ మూడు రోజుల విశాఖ పర్యటన నేపథ్యంలో నాగబాబు నిన్న సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. నేడు విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమైయ్యారు. రేపు జనసేన జనవాణి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల నుండి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
విశాఖలో మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తల దాడి .. జనసేనపై మంత్రులు ఫైర్