YS Viveka Case: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు రాజకీయ అస్త్రంగా మారింది. వివేకా హత్య కేసు నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నాడని, కేసులో నిందితుడికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వైఎస్ షర్మిల గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ వైసీపీని, సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర విపక్ష నేతలు ఈ అంశంపై మాట్లాడుతున్నారు. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.
ఈ తరుణంలో కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, సునీత, దగ్గుబాటి పురందేశ్వరి తదితర లకు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావించకూడదని కడప కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకు వైసీపీ నేతలే కారణమని.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
దీంతో ఎన్నికల వేళ వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్