KCR: రాష్ట్రంలోని ప్రజానీకానికి అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వం నిద్రపోనివ్వకుండా వెంటపడతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసిఆర్ తొలి సారిగా జనాల్లోకి అడుగుపెట్టారు.
కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ శివారులో నార్కెట్ పల్లి – అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్ లో భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న కేసిఆర్ .. రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే అయిపోదని అన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ లో న్యాయమైన వాటా తేలే వరకూ కొట్లాడాలన్నారు.
తాను ఇక్కడకు వచ్చింది రాజకీయాల కోసం కాదనీ, హక్కుల మీద పోరాటానికి సిద్దంగా లేకపోతే నష్టపోతామని చెప్పడానికి వచ్చానన్నారు. కరెంటు ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలనే జనరేటర్ తో నడిపించారని అన్నారు. రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు, ఫోన్లు మోగడం లేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారని విమర్శించారు. దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదని అన్నారు.
ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నామని అన్నారు. ఈ గడ్డను పదేళ్లు పాలన చేశానన్నారు. మీ అందరికి 24 గంటల కరెంటు ఇప్పించిన, ప్రతి ఇంట్లో నల్లపెట్టి నీళ్లు తీసుకొచ్చుకున్నం. ఒక నాడు ఆముదాల మాత్రమే పండిన నల్లగొండలో.. బత్తాయి తోటలతో బతికిన నల్లగొండలో .. లక్షలకు లక్షల టన్నుల వడ్లు పండించుకున్నామన్నారు. అంతకు ముందు లేని నీళ్లు ఇప్పుడు ఎక్కడికెళ్లి వచ్చియ్ అని ప్రశ్నించారు.
మంచి చేయ్యాలి అనే దమ్ము, ధైర్యం ఉండాలి. అలా చేశాం కాబట్టే తెలంగాణలో కృష్ణా, గోదావరి నీళ్లు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. మీకేం కోపం వచ్చిందో.. ఎందుకు లొంగిపోయారో తెల్వదు కానీ పాలిచ్చే బర్రెను అమ్మేసి .. దున్నపోతును తెచ్చుకున్నారు అని ప్రజలను ఉద్దేశించి కేసిఆర్ అన్నారు.
కేసిఆర్ ను బద్నాం చేయాలనే దుష్టబుద్దితో రైతులను ఎండబెడతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని అన్నారు. మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట, మేడిగడ్డ పోయి ఏం పీకుతారు దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్ కుంగలేదా.. కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా అని కేసిఆర్ ప్రశ్నించారు. రైతు బంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా అని ప్రశ్నించారు.
కేసిఆర్ సర్కార్ పోగానే కరెంటు ఎటు పోయిందని అని ప్రశ్నించారు. చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుందన్నారు. అదనపు కరెంటు ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. . రేవంత్ సర్కార్ దొంగ మాటలు మానుకుని పాలమూరు ప్రాజెక్టును ఎలా చేయాలో ఆలోచన చేయమని సూచించారు. అయిదేళ్లు అధికారంలో ఉండండి మాకేమి అభ్యంతరం లేదని అన్నారు.
అపోజిషన్ లో ఉన్నామని కొద్ది రోజులు ఆగుదామని అనుకుంటే అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారన్నారు. ఇప్పుడు ప్రాజెక్టుల మీద రిజర్వు పోలీసులు ఉన్నారని, మంచినీళ్ల కోసం చిప్పపట్టుకుని అడుకోవాలన్నారు. శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుక్కోవాలన్నారు. ప్రాజెక్టులపై మనకు ఉన్న అధికారాన్ని తొమ్మిదిన్నరేళ్లు కాపాడానని అన్నారు. నాడు తనపైనా తీవ్ర ఒత్తిడి తెచ్చారనీ, రాష్ట్రపతి పరిపాలన పెడతామని కూడా హెచ్చరించినా తాను లొంగలేదని కేసిఆర్ అన్నారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టే కాలే వరకు పులిలా కొట్లాడతానని కేసిఆర్ పేర్కొన్నారు. ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. గతంలో నీటి కోసం లోక్ సభను స్తంభింపజేశామన్నారు. ఉదయం లేస్తే కేసిఆర్ ను తిట్టడం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోదన్న కేసిఆర్.. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాన మంత్రిని నిలదీయాలన్నారు. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోము అని చెప్పాలన్నారు. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయని కేసిఆర్ అన్నారు.