BJP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్, ఇన్ చార్జి సిద్ధార్థ నాధ్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ టికెట్ లు దక్కించుకున్న నేతలు హజరైయ్యారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయమని, ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని పురందేశ్వరి తెలిపారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో అభివర్ణించారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు. కానీ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ అధిష్టానం భావించిందని చెప్పారు. అయితే..ఈ బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, సీనియర్ నేతలు విష్ణువర్థన్ రెడ్డి, సత్యకుమార్ లు ఈ సమావేశానికి గైర్హజరు అయ్యారు. ఎన్నికల్లో సీట్లు ఆశించిన ఈ నేతలు భంగపడ్డారు. కీలక సమావేశానికి వీరు డుమ్మా కొట్టడంపై నేతల్లో చర్చ నడుస్తొంది. ఇప్పటికే లోక్ సభ సీటు దక్కకపోవడంపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.
ఇప్పటికే బీజేపీ ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ.. నేడో రేపో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తూ.. పార్టీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న వారికి మొండి చేయి ఇస్తున్నారన్న టాక్ నడుస్తొంది. దీనిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.