టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ బాబుకు ఒక జిల్లా ఎస్పీపై కోపం వచ్చింది.సాధారణంగా కూల్ గా ఉండే లోకేష్ తన సహజ వైఖరికి భిన్నంగా ఆ ఎస్పీపై శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది.
శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటంతో పాటు చైర్మన్ షరీఫ్ కూడా అదే పార్టీకి చెందిన వారు కావడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.వివరాల్లోకి వెళితే ఇటీవల పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఒక ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయడాన్ని టిడిపి దళిత కార్యకర్త మణిరత్నం వేళాకోళం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.దీంతో ఎమ్మెల్యే రోశయ్య ఫిర్యాదు మేరకు సదరు మణిరత్నాన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ లోకేష్బాబు పోలీసుల వైఖరిని ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు.ఇది అక్రమ కేసని మణిరత్నానికి పూర్తిగా తాము అండగా ఉంటామని లోకేష్ చెప్పారు.
గుంటూరు అర్బన్ ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో తెలిపే సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతూ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు లొంగిపోవడం మానుకోవాలన్నారు.దీంతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కూడా సీరియస్ అయ్యారు. లోకేష్ కు కౌంటర్ ఇస్తూ ఆయనకు హెచ్చరికలు సైతం జారీ చేశారు.లోకేష్ ట్వీట్టర్ ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
లోకేష్ కులాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అమ్మిరెడ్డి వ్యాఖ్యానించారు.దీంతో లోకేష్ బాబు ఆగ్రహానికి గురయ్యారు.ఎస్పీ అమ్మిరెడ్డి పై శాసనమండలిలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.తనను ఎస్పీ బెదిరిస్తున్నారని ఇది తన హక్కులకు భంగం కలిగించడమేనని ఆయన పేర్కొన్నారు.సభా సంప్రదాయాల ప్రకారం సదరు ఎస్పీపై చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు శాసనమండలి చైర్మన్ షరీఫ్ ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించారు.ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.