RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు రిలీజ్ అయి 10 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొడుతోంది. విడుదలైన ప్రతి చోట విజయం సాధించడంతో వీకెండ్ కాకుండానే మామూలు రోజుల్లో కూడా సినిమా ప్రేమికులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. బాలీవుడ్ మొదలుకుని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ల విషయంలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరోసారి ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి ప్రపంచానికి, టాలీవుడ్ ఇండస్ట్రీ దమ్ము బాలీవుడ్ కి తెలిసొచ్చేలా రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను కనబరిచాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరల విషయంలో.. పెంచుకునే అవకాశం కల్పించడంతో.. సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండుతోంది.
ఈ క్రమంలో నైజాం ఏరియా పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు..”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వడం జరిగింది. నైజాంలో రికార్డు స్థాయి వసూళ్లతో..”ఆర్ఆర్ఆర్” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలు సెట్ చేస్తూ ఉండటం తో…”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ కి దిల్ రాజు సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన ఈ భారీ ఈవెంట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా మంది సెలబ్రిటీలు..”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ హాజరు కావడం జరిగిందట.
సినిమా కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు అందరితో పాటు ఈ పార్టీకి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా హాజరైనట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 750 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతున్న తరుణంలో … సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నా గాని “ఆర్ఆర్ఆర్” సినిమా థియేటర్లకు జనాలు తండోపతండాలుగా వస్తూ ఉండటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నట్లు.. ఓవరాల్ రన్ టైంలో ప్రతి ఇండస్ట్రీ లో సరికొత్త లెక్కలు “ఆర్ఆర్ఆర్” సెట్ చేయనున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.