YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు అధికారికంగా రాజీనామా చేశారు. లోక్ సభలో రఘురామ కృష్ణరాజు సాంకేతికంగా వైసీపీ సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ సుమారు నాలుగేళ్లుగా దూరంగా పెట్టింది. గత ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు .. కొద్ది కాలానికే రెబల్ ఎంపిగా మారారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు పెడుతూ వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు రఘురామ.
ఈ క్రమంలోనే రఘురామ కృష్ణరాజుపై అనర్హత పిటిషన్ కూడా దాఖలైంది. రఘురామ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత పలు పర్యాయాలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు. మరో పక్క ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు, విమర్శలపైనా గతంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఓ కేసులో అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే. అలానే పలు పోలీస్ స్టేషన్ లోనూ రఘురామపై వైసీపీ శ్రేణుల ఫిర్యాదుతో కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రానికి వస్తే తనను అరెస్టు చేస్తారన్న భయంలో రఘురామ నరసాపురం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కువ రోజులు ఢిల్లీ, హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.
కాగా, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రఘురామ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ సభ్యత్వం నుండి తనను అనర్హుడిగా చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రాధమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాననీ, వెంటనే ఆమోదించాలని కోరారు. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నరసాపురంలో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని అందులో పేర్కొన్నారు.
Medaram Maha Jatara: నేడు వనంలోకి దేవతలు