టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజయ దశమిని పురస్కరించుకుని మరి కొద్ది కాసేపట్లో జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న సంగతి తెలిసిందే. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్ లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 283 మంది ప్రతినిధులు ఆహ్వానాలు పంపగా, వీరంతా హజరైయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ని భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారుస్తూ కేసిఆర్ ప్రకటన చేయనున్నారు.
కేసిఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి గానూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు పలువురు జేడిఎస్ ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమాళవన్, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వీరితో కలిసి సీఎం కేసిఆర్ ఉదయం అల్పాహారం చేశారు. కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు నగరానికి చేరుకున్నారు.
పార్టీ పేరు మార్పు చేసినా గులాబీ రంగు, కారు గుర్తు యధావిధిగా కొనసాగించాలనే కేసిఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తొంది. గత ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేసిన కేసిఆర్ .. ఆ తరువాత సైలెంట్ అయ్యారు. కొద్ది కాలం క్రితం వరకూ కూడా ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన కేసిఆర్ అనూహ్యంగా ఇప్పుడు జాతీయ పార్టీ ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఓ పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న తరుణంలో కేసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారనున్నాయనేది ఆసక్తికరంగా మారుతోంది.