శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రజలంతా చప్పట్లతో గ్రామ సచివాలయ సిబ్బందిని అభినందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం అది విజయవంతం అవడం తెలిసిన సంగతే.
ఈ ప్రత్యేకమైన సందర్భం గురించి అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, ఈ సందర్భంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రికార్డు ఏంటో తెలుసా?
ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చరిత్రాత్మకమైన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. “ఈ ఏడాదిలో వ్యవస్థల పరంగానే కాకుండా ప్రభుత్వ సేవల పరంగా కాకుండా ప్రజల దైనందిన జీవితంలో కొత్త పాత్రల్లో సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముంగిటకే తీసుకువెళ్లటం జరిగింది. అంతేకాకుండా ప్రజల సమస్యలను ఆ గ్రామ సచివాలయాల వద్దనే పరిష్కరించటం జరుగుతోంది. 8 నెలల్లోనే కోటికి పైగా సమస్యలు, ఫిర్యాదులు వస్తే 94 లక్షలు పరిష్కారం అయ్యాయంటే స్వాతంత్రం అనంతరం ఇదొక రికార్డు కింద చెప్పుకోవచ్చు. ఇదంతా సీఎం వైయస్ జగన్ దార్శనికత వల్లనే సాధ్యం అయింది. వైయస్ జగన్ నాయకత్వ ప్రతిభకు చిహ్నం. “అని సజ్జల పేర్కొన్నారు.
ఎందుకు విజయవంతం అయిందంటే…
సచివాలయ వ్యవస్థ విజయవంతం అవడం వెనుక పలు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని సజ్జల పేర్కొన్నారు. “సచివాలయ ఉద్యోగులంతా పోటీ పరీక్షల్లో నెగ్గి వచ్చారు. మా గ్రామానికి సేవ చేస్తున్నామని.. గ్రామంలో ఏ సమస్య ఉన్నా.. పరిష్కరించే బాధ్యత జగనన్న ఇచ్చారని ఉద్యోగులు కూడా వ్యక్తిగతంగా, పట్టుదలతో కృషి చేయటం వల్లనే తక్కువ సమయంలో ఈ వ్యవస్థ విజయవంతం అయింది. ఒకటో తేదీ వచ్చిందంటే తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ళకు వచ్చి, తలుపు తట్టి వాలంటీర్లు పింఛన్ ఇస్తున్నారు. ఒకటో తేదీనే 85% పైగా పింఛన్ల పంపిణీ పూర్తవుతుంది. రేషన్ కార్డు కావాలంటే.. పదిరోజుల్లో, ఇతర సౌకర్యాలు రెండు, మూడు రోజుల్లో, పట్టాలు వారం రోజుల్లో పూర్తి అవుతున్నాయి.“ అని సజ్జల వివరించారు.
ఎందుకు అంతా అలా చేశారంటే…
ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చిందనేలా సచివాలయ వ్యవస్థ పనిచేస్తోందని సజ్జల వివరించారు. “ సచివాలయ ఉద్యోగులు ఈ యజ్ఞంలో పాల్గొని ప్రజాసేవలో అంకితమై పనిచేస్తున్నారు. వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా చప్పట్ల ద్వారా అభినందించాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో, పల్లెల్లో ప్రతి ఒక్కరూ సేవలు పొందుతున్న వారు చప్పట్లు కొట్టి అభినందించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఇంటి బయట వారు నిలబడి చప్పట్ల కొట్టి అభినందించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జిలు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయినందున పార్టీ శ్రేణులు అందరూ పాల్గొని అభినందించారు“ అని తెలిపారు.
ఏడాదిలో ఎన్ని ఆకృత్యాలు చేశారు?
మరోవైపు ఈ ప్రకటనపై బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఎందుకు చప్పట్లు కొట్టాలని ఆయన ప్రశ్నించారు. “బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా?వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా?నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా?అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా?మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా?ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా?చెట్టుకి కట్టేసి కొట్టాలా?సమాధానం చెప్పండి జగన్?“ అని ప్రశ్నించారు. ఏడాదిగా వాలంటీర్లు చేస్తున్న అరాచకాలకు ఇవి అంటూ ట్విట్టర్ లో వీడియోని రిలీజ్ చేశారు.