సంచలనం సృష్టించిన విజయవాడ కారు దహనం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోవోటెల్ హోటల్ సమీపంలో రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరగడం తెలిసిందే.
వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాను అప్పుగా ఇచ్చిన కోటి రూపాయల వసూలు చేసుకునే క్రమంలో గొడవ జరగడంతో బాధితులు ఉన్న కారు పై ఆయన పెట్రోలు పోసి తగలబెట్టారని పోలీసుల కథనం. అయితే పోలీసులు ఈ ఉదంతంపై లోతుగా జరిపిన దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.ఈ హత్యాయత్నంలో కొత్తగా ఒక తహసీల్దార్ పేరు తెర మీదకు వచ్చింది.
బాకీ విషయం సెటిల్మెంట్ చేసుకునేందుకు తన వద్దకు వచ్చిన గంగాధర్ దంపతులు,కృష్ణారెడ్డి లతో మంచిగానే మాట్లాడిన వేణుగోపాలరెడ్డి ఆ తాసిల్దార్ విషయం లేవనెత్తారని సమాచారం. ఆ ముగ్గురికి వేణుగోపాల్రెడ్డి కోటి రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది. దాని రాబట్టుకునే క్రమంలోనే వేణుగోపాల్ రెడ్డి కి వీరికి ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం సెటిల్ చేసుకుందాం రమ్మంటూ వేణుగోపాల్ రెడ్డి పిలవడంతో ఆ ముగ్గురు ఆయన దగ్గరకు వచ్చారు.ఆ సందర్భంలో తనకు తెలిసిన ఓ తహసీల్దార్ కు 5 కోట్లు వచ్చాయని గంగాధర్ దంపతులకు, కృష్ణా రెడ్డికి వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది.పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కోసం బినామీలుగా మనమే ఓ స్థలం తహసీల్దార్ కి కొనిస్తే 2 కోట్లు వస్తాయని వేణుగోపాల్ రెడ్డి వారితో చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో అన్ని సమస్యలు తీరిపోతాయని అతను ప్రతిపాదించాడు.ఇందుకు సమ్మతించి సదరు తాసిల్దార్ ను కలవడానికి వీరంతా కలిసి బయలుదేరారు.ఈ క్రమంలోనే వారు ముందుగా గుంటూరు ఈస్ట్ స్ట్రీట్, తర్వాత ఖలీల్ డాబాకు నలుగురు వెళ్ళినట్టు సమాచారం. ఆ తరువాత సదరు తాసిల్దారు ఏలూరు వెళ్తున్నాడని ,అతడిని మనం నోవాటెల్ హోటల్ దగ్గర కలుద్దాం అంటూ వేణుగోపాల్రెడ్డి వారిని అక్కడికి తీసుకు వచ్చాడని ఉన్నత స్థాయి పోలీసు వర్గాలు తెలిపాయి..
ఆ తర్వాత మద్యం తీసుకొస్తాను అంటూ వెళ్లి పెట్రోల్ తీసుకొచ్చి ఈ ఘాతుకానికి వేణుగోపాల్రెడ్డి పాల్పడ్డాడని ఆ వర్గాలు వివరించాయి.ఆ వర్గాలు వివరించాయి అయితే అదృష్టం బాగుండి ఆ ముగ్గురు బయట పడ్డారు. అయితే అసలు ఆ తాసిల్దారు ఉన్నాడా! లేక బాధితులను నమ్మించడానికి అది వేణుగోపాల్రెడ్డి సృష్టించిన కల్పిత పాత్రనా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పైగా ఇది జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల ఇళ్ల పట్టాల కు సంబంధించిన భూ వ్యవహారం అని కూడా వెల్లడవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అమీతుమీ తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.