(చెన్నై నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల అన్నా డీఎంకె సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో నెలకొన్న సంక్షోభం సమసిపోయింది. సీఎం అభ్యర్థిత్వం విషయంలో ప్రస్తుత సిఎం పళనిస్వామి, డిప్యూటి సీఎం పన్నీర్ సెల్వంలు రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్లాలని భావించిన పార్టీ 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీ సీఎం అభ్యర్థిత్వం విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది. అలకలు, బుజ్జగింపులు తరువాత కీలక పరిణామం చోటుచేసుకున్నది. పార్టీ విజయమే లక్ష్యంగా కలిసి పని చేయాలని నేతలు నిర్ణయించారు. అన్నా డీఎంకె సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళనిస్వామి పేరును డిప్యూటి సీఎం పన్నీరు సెల్వం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకూ నెలకొన్న సంక్షోభం సమసిపోయింది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఇప్పటి నుండి కసరత్తులు ప్రారంభించాయి.