వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఎక్కడ నుంచి పోటీ చేయనున్నారనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన రెండు కీలక నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే.. రెండో నియోజకవర్గం మాట ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఒక నియోజకవర్గం అయితే..ఖరారైనట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. అదే.. భీమవరం. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
అయితే.. ఇప్పుడు పడ్డ చోట నుంచే నిలదొక్కుకోవాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇక్కడ జనసేన అధినేత పవన్ నివాసం ఉండేలా.. వచ్చే ఎన్నికల వరకు పార్టీ నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా.. ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. పవన్ కోసం ఇల్లు వెతుకుతున్న జనసేన నేతలు మూడు నుంచి నాలుగు బెడ్ రూంల ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు
అందులోనే పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక, గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కు 62285 ఓట్లు వచ్చాయి. అయితే.. త్రిముఖ పోటీ నెలకొనడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి అంజిబాబుకు.. 54 వేల ఓట్లు వచ్చాయి. అయితే.. ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేయనున్న దరిమిలా.. ఈ రెండు ఓట్లు కూడా తమకే పడతాయనే అంచనాతో పవన్ ఉన్నారు. దీంతో భారీ మెజారిటీతో ఆయన గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇదిలావుంటే, మంగళవారం నుంచి రెండు రోజులు భీమవరంలో పవన్ బసచేయడంతో పాటు.. ఇక్కడి పార్టీ నాయకులతోనూ భేటీ కానున్నారు. పొత్తులు, సీట్ల కేటాయింపులపై పార్టీ కేడర్కు ఆయన వివరిస్తారు. వివాదాలు.. విమర్శలకు తావు లేకుండా.. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నాయకులతోనూ పవన్ భేటీ అవుతారని సమాచా రం. ఇరుపక్షాల వారికీ విందు ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.