కర్నూలు ఫిబ్రవరి 25 : జనసేన అధికారంలోకి రాగానే కర్నూలును రాజధానికి మించిన నగరంగా తీర్చిదిద్దుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఉదయం పవన్ విద్యార్థులతో ముఖ ముఖి చర్చ నిర్వహించారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కొరత, ప్లేస్ మెంట్స్ , ఫీజు రీయింబర్స్మెంట్ తదితర సమస్యలను విద్యార్థులు పవన్ దృష్టికి తీసుకు వచ్చారు. అన్ని రకాలుగా అండగా ఉంటానని పవన్ విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మోసం చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం అంటే తనకు ఇష్టమని పవన్ తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని పవన్ అన్నారు.
రాజకీయ ప్రక్షాళనే తన లక్షమని పవన్ పేర్కొన్నారు. తన జీవితం రాజకీయాలకు అంకితం అని స్పష్టం చేశారు. కులాన్ని మతాన్ని చూసి ఓట్లు వేయడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.
జనసేన ప్రభుత్వంలో మండలానికో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.. యూనివర్సిటీ విద్యార్థులు తిండి లేకుండా చదువుకునే దుస్థితి నెలకొందన్నారు.
విద్య వ్యాపారంగా మారిందని, చదుకువున్న వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కంటే ఉచిత విద్య అందించడమే మేలని పవన్ అభిప్రాయపడ్డారు
ఈ రోజు మనకి రాజధాని అమరావతి అయినా.. తన మనసుకు మాత్రం కర్నూలే రాజధాని అని పవన్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ఫ్యాక్షనిజం, రౌడీయిజం అవరోధాలుగా మారాయని పవన్ ఆవేదన వక్తం చేశారు. రాయలసీమకు పూర్వ వైభవం తీసుకొస్తానని పవన్ హామీ ఇచ్చారు.
వైసిపి ఎమ్మెల్యేలు చట్టసభలకు వెళ్లకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని పవన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా రాష్ట్ర పర్యటన చేస్తే ఏం ప్రయోజనమని పవన్ ప్రశ్నించారు.