రాజానగరంలో జనసేన ఆశావాహుడిగా ఉన్న బత్తుల బలరామకృష్ణకు జనేన అధినేత పవన్ కళ్యాన్ పెద్ద షాకే ఇచ్చారు. గత యేడాది కాలంగా బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో జనసేన వ్యవహారాలు చూసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితమే పవన్ ఆయనకు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించారు. పవన్ రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారే తప్పా అక్కడ బత్తులకు సీటు ఇస్తున్నట్టు చెప్పలేదు. కానీ బలరామకృష్ణ మాత్రం తనకే పవన్ జనసేన సీటు ఇచ్చేశారని.. తానే పోటీ చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానెల్స్లోనూ, సోషల్ మీడియాలోనూ ఒక్కటే డప్పుకొట్టుకుంటున్నారు.
పవన్ తనకు సీటు ఇచ్చేశారంటూ.. తాను ఎమ్మెల్యే అయిపోయానంటూ బత్తుల చేస్తోన్న హంగామా చూసి జనసేన శ్రేణులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ ప్రచారం మామూలుగా జరగడం లేదు. అయితే తాజాగా పవన్ రాజమండ్రి రూరల్ సీటు విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. రాజానగరంతో పాటు రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్.. రాజమండ్రి రూరల్లో మాత్రం కందుల దుర్గేష్ పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చి.. రాజానగరం అభ్యర్థి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
దీంతో ఇప్పటి వరకు రాజానగరంపై హడావిడి చేస్తూ వచ్చిన బలరామకృష్ణకు ఇది మింగుడుపడడం లేదు. పైగా దుర్గేష్ కాపు వర్గం నేత.. పక్కనే ఉన్న రాజానగరం నుంచి కూడా జనసేన పోటీ చేస్తే శెట్టిబలిజ నేతల పేర్లు కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. పైగా రాజానగరం సీటు విషయంలో టీడీపీ నుంచి పెద్ద అభ్యంతరాలు లేవు. అలాంటి సీటులో పేరు ప్రకటించని పవన్.. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే ఇక్కడ పోటీ చేస్తానని చెపుతున్నా కూడా దుర్గేష్ పేరు ఎనౌన్స్ చేసేశారు.
పవన్ ఇచ్చిన ఈ ప్రకటనతో రూరల్ నియోజకవర్గంలో జనసేన, దుర్గేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అటు రాజానగరంలో మాత్రం బలరామకృష్ణ డీలా పడ్డారు. అసలు బలరామకృష్ణకు సీటు వస్తుందా ? లేదా లెక్కలేనన్ని కాంట్రవర్సీలతో ఉన్న ఈ నేతకు సీటు వస్తే ఇబ్బందులు తప్పవని పవన్ ఆలోచిస్తున్నారా ? అన్న చర్చలు కూడా జిల్లా జనసేన వర్గాల్లోనే నడుస్తున్నాయి.