సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకుని పాపులారిటీ సంపాదించుకోవడంలో ప్రధాని మోదీ తీరే వేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని పదవికి అర్హత సాధించడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ ను ఉపయోగించే వారిలో మోదీనే టాప్. అటువంటి మోదీపై ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోందా. మాటలకే పరిమితం అవుతున్నారని.. చేతలు తగ్గాయని యువత భావిస్తున్నట్టు కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఈ ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమానికి వచ్చిన డిస్ లైక్సే ఉదాహరణ.
మన్ కీ బాత్ ని యువత పట్టించుకోవడం లేదా..
ప్రధాని అయ్యా మోదీ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ‘మన్ కీ బాత్’ ఒకటి. చక్కటి ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటారు. దేశ ప్రజలకు ఎన్నో సందేశాలు ఇస్తారు. తాజా మన్ కీ బాత్ మోదీకి 68వ కార్యక్రమం. ఈసారి మోదీకి ఊహించని షాక్ తగిలింది. ఇందులో బొమ్మల పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులు అంటూ స్వదేశీ జపం చేసారు. ఈ సందేశంపై యూట్యూబ్ లో ప్రతికూల స్పందన వ్యక్తమైంది. పాజిటివ్ కంటే నెగిటివ్ లైక్లు ఎక్కువయ్యాయి. సాక్షాత్తూ బీజేపీ యూట్యూబ్ ఛానెల్లోని ఈ కార్యక్రమానికి 2.3 లక్షల డిస్ లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఏ మన్ కీ బాత్ కార్యక్రమానికి ఈస్థాయిలో డిస్ లైక్స్ రాలేదు. మోదీ యూట్యూబ్ ఛానల్ లోనూ 48 వేలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి. దీంతో మోదీ పాలనపై వ్యతిరేకత వస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
2024లో అధికారం చేపట్టాలటే..
2024లో కూడా ప్రధానిగా మోదీనే బీజేపీ ఎన్నికలకు వెళ్లబోతోంది. ఈ తరుణంలో మోదీపై వ్యతిరేకత రావడం బీజేపీకి మింగుడుపడని విషయం. ఎన్నికలకు సమయం ఉన్నా ఇప్పటి నుంచీ వ్యతిరేక సంకేతాలు మంచివి కావు. వరుసగా మూడోసారి కూడా అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు ఆలోచనలో పడేస్తున్నాయి. బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలంటే పార్టీతో సహా ప్రధాన మోదీ ఆకట్టుకోవాల్సింది యువతనే. దేశంలో మోదీ పాలనే ఉండాలని కోరుకున్న యువత, ప్రజలు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన వ్యతిరేకతను ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఇందుకు బీజేపీ, ప్రధాని మోదీ కొత్తగా ప్రజలను ఆకట్టుకోవాల్సిందే.