Kuppam: తన పుత్రరత్నం నారా లోకేష్ బాబు శక్తిసామర్థ్యాలపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా నమ్మకం సడలిందా అన్న అనుమానం రేకెత్తించే పరిణామం టీడీపీలో చోటు చేసుకుంది.ఇదే ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది.
Kuppam: కుప్పం లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ!
వివరాల్లోకి వెళితే…ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా గతం లో మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా ఉంది.సహజంగానే ఇవి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ఎన్నికలు. ఇప్పటికే కుప్పంలో ఒకసారి చంద్రబాబు తల బొప్పి కట్టింది కాబట్టి ఈసారి ఈ ఎన్నికలను ఆయన ఈజీగా తీసుకునే అవకాశాలు లేవు.అయితే ఇంత చిన్న ఎన్నికల కోసం తాను వెళితే తన స్థాయి దిగజారి పోతుందని చంద్రబాబుకు తెలుసు.కానీ విజయం కూడా ముఖ్యమే కాబట్టి ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఈ నేపధ్యంలో తన సొంత నియోజకవర్గంలో గెలుపు బాధ్యతను తన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా నారా లోకేష్ పై పెడతారని అందరూ ఊహించారు.కానీ ఇందుకు భిన్నమైన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుని అందరికీ షాకిచ్చారు.
Kuppam: లోకేష్ ను కాదని రామానాయుడికి బాధ్యతలు!
నారా లోకేష్ ను పక్కనబెట్టి పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు కి కుప్పం గెలుపు బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు.రామానాయుడు సమర్థుడైన నాయకుడే. మొన్నటి వైసిపి సునామీలో కూడా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొంది తన ఛరిష్మాను నిరూపించుకున్నారు.కాబట్టి ఆయనకు కుప్పం బాధ్యతలు అప్పగించటం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు.కాకుంటే తన సొంత నియోజకవర్గం బాధ్యతలను కుమారుడు నారా లోకేశ్ కు చంద్రబాబు అప్పగించకపోవడంపై పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది.లోకేష్ కు రాజకీయంగా అంత సీన్ లేదని చంద్రబాబే భావిస్తున్నారా అన్న పాయింట్ ను పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
టీడీపీని కుదిపేసే నిర్ణయం ఇది!
నిజానికి చంద్రబాబు తన రాజకీయ వారసునిగా లోకేష్ ను తయారు చేయాలని నిర్ణయించుకొని ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు.కానీ లోకేష్ రాణించకపోవడం అటుంచి మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో ఘోరంగా ఓడిపోయారు.పైగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి లోకేష్ ను పంపితే అక్కడ ఏదో ఒకటి తప్పుగా మాట్లాడి అవహేళనకు గురవుతున్నారు.మీడియాకు చిక్కిపోతున్నారు.ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఇప్పటికైతే లోకేష్ ను పక్కనబెట్టటం మంచిదనే నిర్ణయానికి వచ్చే రామానాయుడికి కుప్పం బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.కానీ తండ్రే కుమారుడి శక్తి సామర్థ్యాలను అనుమానిస్తే ఇక లోకేష్ ఎలా ఎదుగుతాడని పార్టీలోని ఆయన వర్గం వాపోతోంది.మొత్తం మీద ఈ పరిణామం టిడిపిని ఒక కుదుపు కుదిపే సూచనలు గోచరిస్తున్నాయి.