Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి స్పందించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి .. భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని కేటిఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నారని, ఏమయితది చర్లపల్లి జైలులో కూర్చోవాల్సి వస్తుందని, చిప్పకూడు తినాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అచ్చోసిన ఆంబోతులా కేటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. తగిన ఫలితం ఉంటుందని అన్నారు. ట్యాపింగ్ పై విచారణ జరుగుతోందని, తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. అధికారులకు ఆ రోజే చెప్పా.. వినలేదు.. ఇవాళ జైలుకు వెళ్తే .. అటు వైపు చూడటం లేదని అన్నారు.
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సంపత్ కుమార్ కు ప్రభుత్వంలో పదవి వస్తుందని, ఆ మేరకు తాను అధినాయకత్వంతో మాట్లాడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆయన మాట ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని అన్నారు.
రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎకమయ్యాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాకు డీకే అరుణ ఏమి చేశారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమె జాతీయ హోదా తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుండి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.