Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 (రేపు) వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ వరకూ పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 12 రోజుల పాటు పది నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ రూట్ మ్యాప్ ఖరారు చేసింది.
తొలి విడతలో అయిదు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మళ్లీ వచ్చే నెల 9వ తేదీన పవన్ పిఠాపురానికి రానున్నారు. 9వ తేదీన పిఠాపురంలోనే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు.
పిఠాపురంలో శక్తి పీఠం పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూలు చేయించనున్నారు. ఆ తర్వాత దత్త పీఠాన్ని సందర్శించనున్నారు. తొలి విడత ప్రచారంలో అయిదు రోజులు అక్కడే బహిరంగ సభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిద వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ శ్రేణులతోనూ సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న ప్రచారం చేయనున్నారు.
పవన్ తొలి విడత ఎన్నికల ప్రచార షెడ్యుల్
- ఏప్రిల్ 3 – తెనాలి
- ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
- ఏప్రిల్ 5 – అనకాపల్లి
- ఏప్రిల్ 6 – ఎలమంచిలి
- ఏప్రిల్ 7 – పెందుర్తి
- ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
- ఏప్రిల్ 9 – పిఠాపురంలో ఉగాది వేడుకలు
- ఏప్రిల్ 10 – రాజోలు
- ఏప్రిల్ 11 -పి గన్నవరం
- ఏప్రిల్ 12 – రాజానగరం