TDP Leaders Protest: టీడీపీ అభ్యర్ధుల తుది జాబితాను ఇవేళ ప్రకటించింది. అయితే పలువురు ఆశావహులకు టికెట్ దగ్గకపోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశిస్తుండగా, పార్టీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అర్బన్ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు చేరుకుని కంప్యూటర్, పర్నిచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కార్యాలయంలోని ఇతర సామాగ్రిని బయట వేసి నిప్పు అంటించారు. అర్బన్ టికెట్లను రూ.30 కోట్లకు అమ్ముకున్నారని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపణలు చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
కాగా, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళా కార్యకర్త స్పృహ కోల్పోగా, సహచర కార్యకర్తలు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గడిచిన అయిదు సంవత్సరాలుగా ప్రభాకర్ చౌదరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టుకున్నారని పేర్కొన్నారు. దగ్గుపాటి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ప్రశ్నించారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
అలానే గుంతకల్లులోనూ తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేశారు. గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి జితేందర్ గౌడ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు.