ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దుపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది.
జగన్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పిటిషన్ వేసిన నేపథ్యంలో జరిగే విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఏపీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ పరిణామం షాక్ వంటిదని అంటున్నారు.
ఆ పేరు ఎవరూ వాడవద్దు
‘YSR కాంగ్రెస్’ పేరు ఎవరూ వాడకుండా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ‘అన్న YSR కాంగ్రెస్’ పార్టీ జాతీయ అధ్యక్షులు మహబూబ్ బాషా, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వం ECIకి, జగన్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. అయితే, ఇంత వరకూ వారు కౌంటర్ దాఖలు చేయలేదు. విచారణకు మరో వాయిదా కోరతారా, ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. తమకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందని అన్న వైఎస్సార్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పంచాయతీ
కాగా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీ హైకోర్టులో ఇబ్బందులు ఎదురయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉంది, భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ, లోక్సభ స్పీకర్, స్థానిక పోలీసులకు లేఖలు రాసిన రఘురామకృష్ణంరాజు ఈ వ్యవహారంపై హోంశాఖ పెద్దలను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు.
రఘురామ రాజు గారిది అదే కథ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజును సంజాయిషీ కోరుతూ వైసీపీ షోకాజ్ నోటీసులు ఇవ్వగా తాను ఎంపీగా గెలిచింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు మీద అంటూ ట్విస్ట్ ఇచ్చిన రఘురామ కృష్ణంరాజు ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని నిబంధనల్ని వివరించారు. అంతేకాదు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరు మీద తనకు షోకాజ్ నోటీసు పంపారని.. కానీ, తాను గెలిచిన పార్టీ ప్రాంతీయ పార్టీ అని గుర్తుచేసిన సంగతి తెలిసిందే.