Sonu Sood: తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని చొరగొన్న బాలీ వుడ్ నటుడు సోనూ సూద్ నివాసం, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు జరపడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఐటీ శాఖ అధికారులు నేడు సోనూ సూద్ ఆదాయపన్నుకు సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. సోనూ సూద్ సుమారు రూ.20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఐటీ శాఖ నేడు ఒక ప్రకటన విడుదర చేసింది. సోనూ సూద్ కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ విదేశీ విరాళాల చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. సోనూ సూద్ కు సంబంధించిన నివాసంతో పాటు ఆయన సంభందీకుల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అనేక పత్రాలు లభించినట్లు తెలిపింది.
కరోనా మహమ్మారి విజృంభించి వేళ దేశ వ్యాప్తంగా సోను సూద్ తన విరాళాలతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ సంస్థ ను గత సంవత్సరం జూలై లో ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఆ సంస్థ రూ.20 కోట్ల విరాళాల రూపంలో సేకరించినట్లు సమాచారం. దానిలో ఇప్పటి వరకూ రూ.1.3 కోట్ల ను ఖర్చు చేయగా మరో రూ.17 కోట్లు ఆ సంస్థ బ్యాంకు అకౌంట్ లోనే ఉన్నట్లు గుర్తించారు.
సోను సూద్ కార్యాలయాలు, నివాసాల్లో మూడు రోజులుగా ఐటీ సోదాలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఐటి శాఖ మాత్రం సోదాలో లభించిన డాక్రుమెంట్ ల ఆధారంగా సోనూ సూద్ లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో ఉన్న ప్రాపర్టీ డీల్ పై దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సోనూ సూద్ పై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోనూ సూద్ ను దేశ్ కే మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయనపై ఐటీ దాడులు జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.