దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. పేద , మధ్య తరగతి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు నెలలపాటు ఉచితంగా ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యంతో పాటు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా వారిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1.91 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తం 12 కిలోలు అందించింది. ప్రస్తుతం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన పేదలకు సరైన ఉపాధి లభించడం లేదు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్ నెలతో ముగుస్తుంది. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు క్షీణించిపోవడం, వరదలతో పంట నష్టం సంభవించడం, నిర్మాణరంగం ఇంకా కోలుకోక పోవడంతో వలస కూలీలు దుర్భర పరిస్థితుల్లో జీవనాన్ని సాగిస్తున్నారు. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ మార్చి వరకు పొడిగించాలని ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాలు, ఆర్థిక శాఖ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై వచ్చేనెల మొదటి లేదా రెండో వారంలో కేంద్రం ప్రకటన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడి చేస్తున్నాయి.