ఇప్పుడు అందరి చూపు క్రిస్మస్ సందడి గురించో… కొత్త సంవత్సర వేడుకలు ఎలా చేసుకోవాలా? సంక్రాంతి సంబురాలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానిపై లేదు!
కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు మనకు అందుబాటులోకి వస్తుందా? దాని ధర ఎంత ఉంటుందా? అనే దానిపైనే ఉంది. అయితే, అందరి కంటే ముందే ఈ వ్యాక్సిన్ పొందేందుకు ఉన్న ఆప్షన్స్ గురించి పలువురు వెతుకుతున్నారు. అలాంటి వారికి ఓ ఆప్షన్ దొరికేసింది.
మీకు ముందే వ్యాక్సిన్….
కరోనా నియత్రణ కోసం విదేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయించింది. అయితే, ఇది భారతీయులకు ఓ గొప్ప చాన్స్ను తెచ్చి పెట్టిందంటున్నారు. ఏంటి? ఎందుకు అంటారా? చాలా మంది యూకే వెళ్లి.. వ్యాక్సిన్ వేసుకోడానికి రెడీ అయిపోతున్నారు. దీని కోసం ట్రావెల్ ఏజన్సీలను సంప్రదిస్తూ… లండన్ కు వెళ్లేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు
అబ్బో…ఇది బాగుందయ్యా…
భారతీయులు ఆశలు మామూలుగా లేవని పలువురు చెప్తున్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి లండన్ కు ఎవరు వెళ్లినా, ఐదు రోజుల సెల్ఫ్ ఐసొలేషన్ తప్పనిసరి. ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాక.. దేశంలో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. మరోవైపు, లండన్ లో వచ్చే వారంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభం కానుండగా, ఇప్పటికే భారత్ కు చెందిన ఓ ట్రావెల్ ఏజంట్, మూడు రాత్రుల ప్యాకేజీని ప్రకటించింది. తాము యూకే వెళితే వ్యాక్సిన్ ను ఎక్కడ, ఎప్పుడు ఎలా తీసుకోవచ్చని ఎంతో మంది తమను అడుతున్నట్లు ముంబైకి చెందిన ఓ ప్రముఖ ట్రావెల్ ఏజంట్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేమని మాత్రమే తాము సమాధానం ఇస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే ఇండియన్స్ కు వ్యాక్సిన్ ఇస్తారా? అన్న విషయంపైనా ఇంకా సమాచారం లభించలేదని ఆయన తెలిపారు. ఇండియన్ పాస్ పోర్టు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటిస్తే, ఇక్కడి నుంచి వందల సంఖ్యలో టికెట్లు లండన్ కు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ‘ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపక సీఈఓ నిశాంత్ పిట్టి. ఇదండి మన ఇండియన్ల తెలివి.