TDP: జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో పలు కీలక స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు జరిపిన నేపథ్యంలో జనసేనకు కేటాయించే స్థానాలు ఇవి అంటూ కొన్ని నియోజకవర్గాల పేర్లు బయటకు వచ్చాయి.
రాజమండ్రి రూరల్ కూడా జనసేనకు కేటాయిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ లాబీలో రాజమండ్రి రూరల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వైసీపీ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పలకరిస్తూ మీరూ .. నేనూ రిటైర్ కాబోతున్నామన్నారు. అందుకు రియాక్ట్ అయిన బుచ్చయ్య తానేమీ రిటైర్ కావడం లేదని సమాధానం ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో మీకు (బుచ్చయ్య) కు టికెట్ ఉండదంటున్నారని నాని అనగా, 2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీలో ఉంటానని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల్లో టిక్కెట్ ఇవ్వాలా ..? వద్దా అనేది పార్టీ అధినాయకత్వాల ఇష్టమే కదా అని పేర్ని నాని అనగా, నా విషయంలో మా అధిష్టానం అలా ఆలోచించదు అని బుచ్చయ్య అన్నారు. సో..బుచ్చయ్య అన్న దాన్ని పట్టి చూస్తే త్యాగరాజు అవ్వడానికి తాను సిద్దంగా లేరు అనేది స్పష్టం అవుతోంది.
ఇదే అంశంపై బుచ్చయ్య చౌదరిని అక్కడ పలకరించిన మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తానని గతంలో చంద్రబాబు చెప్పారన్నారు. ప్రత్యేకంగా తాను టికెట్ ఇవ్వమని అడగనని అన్నారు. ఆందోళన చెందవద్దని తన క్యాడర్ కు కూడా చెప్పానన్నారు. సీట్ల కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారని, తర్వలో చర్చలు కొలిక్కి వస్తాయని పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు అడగటానికి జనసేన ప్రయత్నం చేస్తొందని, అయితే జిల్లాలో అన్ని కులాలను చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. జనసేనతో పొత్తులపై రాష్ట్రమంతా యూనిట్ గా చూడాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏడు పదుల వయసులో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్. టీడీపీ ఆవిర్భావం 1983 నుండి ఆ పార్టీలో ఉన్నారు. రాజమండ్రి సిటీ నుండి నాలుగు సార్లు, రూరల్ నుండి రెండు సార్లు మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగానూ బాద్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి ఓటమి పాలైన జిల్లా నేత కందుల దుర్గేష్ ఆ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కందుల దుర్గేష్ కు 42వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2009లోనూ రాజమండ్రి రూరల్ లో పీఆర్పీ అభ్యర్ధికి 31శాతం కుపైగా (43వేల) ఓట్లు వచ్చాయి. ఈ కారణంగా పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన కోరుతున్నట్లుగా తెలుస్తొంది. దీంతో ఈ స్థానంలో సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికే మరో సారి అవకాశం కల్పిస్తారా లేక జనసేనకు కేటాయిస్తారా అనేది హాట్ టాపిక్ గా ఉంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి చంద్రన రమేష్ 1547 స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2014 లో 18వేలు, 2019లో 10 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ సీనియర్ నేతకు చంద్రబాబు టికెట్ ఖరారు చేస్తారా ..? లేక షాక్ ఇస్తారా..? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.