Panjagutta Accident Case: పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 23న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముందు బారికేడ్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ కారుతో ఢీకొట్టి పరారైయ్యాడు.
అయితే ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన నిందితుడైన సాహెల్ ను తప్పించి అతని డ్రైవర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. సాహెల్ ను తప్పించడంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అప్పటికే సాహెల్ దుబాయ్ పారిపోగా, అతనిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
తాజాగా ఈ కేసు విషయంపై డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించారన్నారు.
ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్ పెక్టర్ తో పాటు బోధన్ సీఐని కూడా అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని, ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాగా, ఈ కేసులో నిందితుడిని తప్పించడంలో సీఐ దుర్గారావు కీలకంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలడంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ ఆయనను సస్పెంచ్ చేశారు. అప్పటి నుండి దుర్గారావు పరారీలో ఉండగా, అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ వద్ద సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు.